హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): బ్లాక్ దందాకు తెగబడ్డ ఇద్దరు డాక్టర్లు అడ్డంగా దొరికిపోయారు. బ్లాక్ఫంగస్ చికిత్సలో వినియోగించే ఇంజెక్షన్లను బ్లాక్లో అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నించిన మెడికల్ ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టుచేశారు.
వీరిలో ఇద్దరు ప్రయివేటు డాక్టర్లు ఉన్నారని టాస్క్ఫోర్స్ డీసీపీ రాధకిషన్రావు తెలిపారు. సైదాబాద్లో క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ దుబ్ల రమేశ్కుమార్, ఇండో యూఎస్ దవాఖానలో పనిచేస్తున్న నాగోల్కు చెందిన డాక్టర్ లింగాల రాఘవేందర్గౌడ్ నిఖిల్, సైఫాబాద్ మెడికవర్ దవాఖానలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న యూసఫ్గూడాకు చెందిన జల్లు శ్రీకాంత్, టెక్నీషియన్ మహ్మద్ అసద్ ముఠాగా ఏర్పడ్డారు.
ఎమ్మార్పీ రూ.7,400 ఉన్న లింప్సోమల్ అంపోటెరిసిన్ బీ ఇంజెక్షన్లను బ్లాక్లో ఒక్కొక్కటి రూ.50 వేలకు అమ్ముకొనేందుకు పథకం రచించారు. డాక్టర్ రమేశ్కుమార్ మెడికల్ ఏజెంట్ వుట్ల సైదులు నుంచి వీటిని సేకరించాడు.
సైఫాబాద్లోని మెడికవర్ దవాఖాన వద్ద కస్టమర్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముఠాను టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం అరెస్టు చేసింది. వీరి వద్ద నుంచి ఆరు ఇంజెక్షన్లు, నాలుగు సెల్ఫోన్లు, రూ.29,600 నగదు స్వాధీనం చేసుకొన్నారు. కేసు విచారణను సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇంజెక్షన్లు సరఫరా చేసిన సైదులు పరారీలో ఉన్నాడు.