హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం వేగంగా అంతరించిపోతున్న ప్రాచీన జీవుల్లో ‘కామన్ ఇండియన్ మానిటర్’ ఒకటి. బెంగాల్ మానిటర్ (వారనస్ బెంగాలెన్సిస్)గానూ ప్రసిద్ధి పొందిన ఈ సరీసృప జీవులు వేటగాళ్ల నిర్వాకానికి బలైపోతున్నాయి. దీనికి తోడు వాతావరణ మార్పులు వీటి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఉడుముల సంరక్షణ కోసం హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) జన్యు శాస్త్రవేత్తలు ప్రత్యేక అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అజయ్గౌర్ నేతృత్వంలో ఈ ఉడుము మైటోకాండ్రియల్ సీక్వెన్స్ను రూపొందించే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి జీవిస్తున్న ఇలాంటి జీవజాతుల పరిరక్షణకు మరింత జన్యు సమాచారాన్ని సేకరించాలని అభిప్రాయపడ్డారు. అందుకు పూర్తిస్థాయిలో ఫైలోజెనెటిక్ అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని తమ నివేదికలో పేర్కొన్నారు.
వేటగాళ్లే ప్రధాన శత్రువులు
బెంగాల్ మానిటర్లు ప్రధానంగా వేటకు బలైపోతున్నాయి. ఈ ఉడుముల వేటను ప్రభుత్వం ఎప్పుడో నిషేధించినా ఇప్పటికీ పలు ప్రాం తాల్లో వీటి మాంసం, శరీర భాగాల అక్రమ వ్యాపారం విస్తృతంగా సాగుతున్నది. ప్రత్యేకించి ఈ ఉడుము జననేంద్రియాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నది. ఇవి కామోద్దీపనలను ప్రేరేపిస్తాయని, వ్యాధుల నివారణకూ ఉపయోగపడతాయన్న మూఢ నమ్మకమే ఇందుకు కారణం. మరోవైపు ఈ ఉడుము చర్మాన్ని డ్రమ్ముల తయారీకి వినియోగిస్తున్నారు. వీటి గుడ్లకు సైతం డిమాండ్ ఉండటంతో ఏకంగా దుకాణాల్లోనే పెట్టి అమ్ముతున్నారు.