హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ) : మంచిపని చేసేందుకు, చేసే వారికి సహకరించేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వరదల సమయంలో జంతువులను రక్షించేందుకు ఆఫ్రోడ్ వాహనం ఒకటి కావాలంటూ ఓ సొసైటీ ట్విట్టర్లో చేసిన విజ్ఞప్తిపై మంత్రి వేగంగా స్పందించారు.
‘భద్రాచలం పరిసర ప్రాంతాల్లో గోదావరి వరదల సమయంలో ఎన్నో జంతువులను రక్షించాం. సరైన వాహనం లేకపోవడంతో రవాణా భయంకరంగా మారింది. వరద ఉపశమన సమయంలో జంతువులను త్వరగా చేరుకోవడంలో సహాయపడేలా ఓ ఆఫ్రోడ్ వాహనం సమకూర్చి మాకు సాయం చేయండి..’ అని యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ మంత్రి కేటీఆర్, రతన్టాటాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘వ్యక్తిగతంగా మీకు సపోర్ట్ చేయడం సంతోషంగా భావిస్తాను. నా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఈ మంచి పనిని కొనసాగించండి..’ అని ట్వీట్ చేశారు.
ఇన్నోవేషన్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రాం భేష్..
టీఎస్ఐసీ ఇన్నోవేషన్ ఇమ్మర్షన్ ప్రోగాంలో భాగంగా ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్లో యాదాద్రి జిల్లాకు చెందిన 200 మంది విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. “క్యాచ్ దెమ్ యంగ్ అండ్ వాచ్ దెమ్ గ్రో” కార్యక్రమం బాగా చేశారని టీమ్ టీఎస్ఐసీని ప్రశంసించారు. మిగిలిన జిల్లాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని సూచిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.