నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ‘నేను 30 రోజులే జైల్లో ఉన్న. అమిత్షా 90 రోజులు జైల్లో ఉన్నడు. గుజరాత్లో అడుగుపెట్టకుండా అమిత్షాపై రెండున్నరేండ్లు నిషేధం విధించారు. 90 రోజులు జైల్లో ఉన్నోడు పెట్టే గడ్డి బాగుందా?’ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రతిష్ఠను, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాజగోపాల్రెడ్డి రూ.21 వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చున్నారని ఆరోపించారు.
నామినేషన్ వేసే ముందు అమిత్షా నుంచి 5 వేల కోట్ల ప్యాకేజీ తీసుకొచ్చి బ్రాహ్మణవెల్లంల, ఎస్ఎల్బీసీ పాజెక్టును పూర్తిచేయాలని సవాల్ విసిరారు. లేకపోతే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నేతలంతా తరలివచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొలేకే బీజేపీ ఈడీ పేరుతో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని అవమానిస్తుంటే.. కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అమిత్షా పంచన చేరాడని ధ్వజమెత్తారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తా అన్న రాజ్గోపాల్రెడ్డి.. రాజీనామా చేసి తిరిగి ఎందుకు కాంగ్రెస్ నుంచే పోటీ చేయడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సభలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ మంత్రులు రాంరెడ్డి దామోదర్రెడ్డి, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.