ఖైరతాబాద్, మార్చి 29 : అమీన్పూర్ పెద్దచెరువును పట్టాభూముల్లోకి విస్తరించి తమను భూ నిర్వాసితులను చేసేందుకు కుట్ర చేస్తున్నారని అమీన్పూర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో స్వర్ణశ్రీ, ప్రమీల, సాంబయ్య, సత్యనారాయణ తమ గోడు వెల్లబోసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్ పరిధిలో 1984-2006 మధ్య 3వేల మంది ప్లాట్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. సర్వే నంబర్ 231లో ఉన్న అమీన్పూర్ పెద్దచెరువు విస్తీర్ణం 93 ఎకరాలు ఉండగా హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులు 450 ఎకరాల్లో విస్తరించి ఉన్నదని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. 2018 నుంచి తమ ప్లాట్ల కోసం పోరాడుతున్నామని, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వచ్చిందని, అధికారుల తీరుతో తమ ప్లాట్లలో తాము ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.
చెరువు అలుగు మూసివేయడంతో మురుగునీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలు తమ ప్లాట్లలోకి చేరి చెరువులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో లేని తమ ప్లాట్లను వాటి పరిధిలో ఉన్నాయంటూ అధికారులు చెప్పడం బాధాకరమన్నారు. చెరువు చుట్టుపక్కల కబ్జాలు జరిగాయని, పెద్ద పెద్ద భవనాలు నిర్మించారని తెలిపారు. అలుగు ప్రాంతాన్ని మాయం చేయడంతో నీరు తమ ప్లాట్లలోకి వస్తుందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే అలుగు మూసుకుపోయిందని, దానిని గుర్తించాల్సి ఉందని బుకాయిస్తున్నారని వాపోయారు. హెచ్ఎండీఏ రికార్డుల్లో అమీన్పూర్ పెద్ద చెరువు విస్తీర్ణం 93 ఎకరాల్లో ఉన్నట్టు స్పష్టంగా ఉందని చెప్పారు. తాజాగా చెరువు పక్కనే ఒకరు 40 ఫోర్లతో నిర్మాణం చేపట్టాడని, అది హైడ్రాకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తమ ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని చూస్తే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.