Ambedkar Overseas vidya Nidhi | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): దళిత, గిరిజనుల్లో ఇంకా వీడని సా మాజిక, ఆర్థిక వెనుకబాటుతనం.. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉంటేనే అవకా శం.. విదేశీ విద్య అంటే ఆయా వర్గాలకు అం దని ద్రాక్షే.. దాన్ని కలలో కూడా ఊహించని ఆ వర్గాలకు తెలంగాణ రాష్ట్రం నేడు నిజం చేసి చూపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దన్నుతో దళిత, గిరిజన విద్యార్థులెందరో వెనుకబాటుతనం పొలిమేరలను దాటి విదేశాలకు పయనమవుతున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఆదిశగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. ఆర్థికంగానే కాకుండా అన్నివిధాలా సహకారాన్ని అందిస్తున్నది. స్కాలర్షిప్పులు ఇస్తూ విదేశీ విద్య, ఉద్యోగ కలలను ప్రభుత్వం సాకారం చేస్తున్నది.
యూఎస్ఏ, స్కాట్లండ్, సింగపూర్ తదితర దేశాల ఫెలోషిప్, ఇంటర్న్షిప్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లకు ఎంపికయ్యేలా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీలు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదునిస్తున్నాయి. దీంతో దళిత, గిరిజన విద్యార్థులెందరో వివిధ ప్రోగ్రామ్ల కింద విదేశాలకు వెళ్లే అవకాశాలను పొందుతున్నారు. అకడమిక్స్లో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి, వారికి జీఆర్ఈ, ఐలెట్స్ తదితర పరీక్షల కోసం శిక్షణ ఇప్పిస్తున్నది. ఎంపికైన విద్యార్థులకు ప్రయాణ ఖర్చులూ అందిస్తున్నది.
ఇప్పటివరకు పాఠశాల స్థాయిలో కెనడీ లూగర్ యూత్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రో గ్రాం, కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రొ గ్రామ్ (సీసీఐపీ), హార్వర్డ్ సమ్మర్ క్రాస్ రోడ్స్ ప్రోగ్రామ్, యూఎస్ గ్రాండ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ల కింద గురుకుల విద్యార్థులెందరో విదేశీ విద్యకు ఎంపికయ్యారు. డిగ్రీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టూడెంట్, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద 100 మందికి పైగా గురుకుల విద్యార్థులు విదేశీ చదువు కోసం వెళ్లారు.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా అట్టడుగువర్గాల కలలను సాకారం చేస్తున్నది. మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ తదితర కోర్సులు చదివేందుకు ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తున్నది. వీసా చార్జీలు, ప్రయా ణ ఖర్చులకు గరిష్ఠంగా రూ.50 వేలను అందజేస్తుంది. మహిళలకు 35 శాతం రిజర్వేషన్ను అమలు చేస్తుండటం మరో విశేషం. ఇప్పటివరకు దాదాపు 1,143 మందికి పైగా ఈ పథకం కింద విదేశాలకు వెళ్లారు. విదేశాల్లోని పలు ప్రముఖ యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
దళితులు విదేశాల్లో ఉపాధి అవకాశాలను పొందేందుకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. పైలట్ ప్రాజెక్టుగా నర్సింగ్, జీఎన్ఎం పూర్తి చేసిన దళిత యువతులకు విదేశాల్లో ఉద్యోగాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఐలెట్స్ ఫీజు రూ.16 వేలు, ఓఈటీ ఫీజును రూ.35 వేలతో పాటు, పాస్పోర్ట్ ఫీజును కూడా ప్రభుత్వ మే చెల్లిస్తున్నది. ఇప్పటివరకు 406 మందికి శిక్షణ ఇవ్వగా, 160 మంది విదేశాలకు వెళ్లేందుకు కావాల్సిన అన్ని ప్రక్రియలను పూర్తి చేసింది. బ్రిటన్, సౌదీ అరేబియాలోని వివిధ పేరొందిన దవాఖానల్లో ఉపాధి కల్పించేందుకు ఒప్పందాలు పూర్తి చేసుకున్నది.