హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్తత కొనసాగుతున్నది. అక్కడ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించి అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. పట్టణం వైపు వచ్చే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేశారు. సెల్ఫోన్ సిగ్నళ్లను ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు.
పరిస్థితి పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు.. కోనసీమ వ్యాప్తంగా సెక్షన్ 144, సెక్షన్ 30ని అమలు చేస్తున్నా రు. అటు.. మంగళవారం నాటి విధ్వంసానికి సంబంధించి 7 కేసులు నమోదు చేశామని ఆ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 46 మందిని అరెస్టు చేశామని, మరో 72 మంది అరెస్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.
బుధవారం కోనసీమ జిల్లాలోని రావులపాలెం రింగ్రోడ్డు వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించటంతో పారిపోయారు. ఇదిలా ఉండగా, అమలాపురంలో చెలరేగిన అల్లర్లకు కీలక సూత్రధారిగా భావిస్తున్న అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఘటనపై అతడిని విచారిస్తున్నారు.