హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏ పంట సాగు చేసినా నాలుగు రూపాయలు మిగిలితే చాలనుకుంటాడు రైతు. సరైన మార్కెటింగ్, మంచి ధర కల్పిస్తే ఏ పంట సాగుచేసేందుకైనా అన్నదాత సిద్ధంగా ఉంటాడు. అనేక రకాల పంటల సాగుకు మన భూములు అనుకూలమైనప్పటికీ ఎక్కువ మంది రైతులు వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. ఈ యాసంగిలో దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రైతులు కచ్చితంగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ మంది అన్నదాతల్లో వరి సాగుతోనే అధిక లాభాలు వస్తాయనే అపోహ ఉన్నది. కానీ దానికి మించి లాభాలు అందించే పంటలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పప్పు దినుసులు, నూనె గింజల పంటలు కాసులు కురిపిస్తాయి. ఈ రెండు రకాల పంటలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటంతో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మద్దతు ధరకు మించి ధర పలుకుతున్నది. ఈ క్రమంలో అసలు పప్పు దినుసులు, నూనె గింజల సాగుతో ఎలాంటి లాభాలున్నాయి? రైతులు ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందనే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఓ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పప్పులు, నూనె గింజల సాగులో రైతు పెట్టుబడికి రెండింతల ఆదాయం పక్కా అని తేలింది. ఇది మద్దతు ధరతో పోల్చితేనే. కానీ మార్కెట్లో ఈ పంటలు మద్దతు ధరకు మించి అమ్ముడుపోతున్నాయి. అంటే రైతుకు ఇంకా అధిక లాభాలు ఖాయంగా కనిపిస్తున్నది.