హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ పీహెచ్డీ కోర్సులకు అవకాశం కల్పించిన జేఎన్టీయూ ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రక్రియను ప్రారంభించనున్నది. యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం అటానమస్ కాలేజీల్లోనే ఈ కోర్సుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో దరఖాస్తులు సమర్పించిన వాటిల్లో నిబంధనల మేరకు 40 కాలేజీల్లో రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు జేఎన్టీయూ అనుమతి ఇచ్చింది. వాటిల్లో 30 ఇంజినీరింగ్, 10 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఈ నెలలోనే కేంద్రీకృత పద్ధతిలో పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంకానున్నది. జేఎన్టీయూ యాజమాన్యమే అడ్మిషన్లను చేపట్టనుండగా, రీసెర్చ్ వర్క్ మాత్రం ఆయా కాలేజీల్లో కొనసాగుతుంది.