10 గంటలపాటు సాగిన ప్రక్రియ
అనుమానాలకు తావులేకుండా లాటరీ
యూట్యూబ్, ఫేస్బుక్లో లైవ్
నేడు బండ్లగూడ ఫ్లాట్లకు లాటరీ
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ సోమవారం మొదలైంది. తొలిరోజు పోచారంలోని 1,470 ఫ్లాట్ల కేటాయింపును అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఉదయం 9కి మొదలైన ఈ ప్రక్రియ దాదాపు 10 గంటలు (రాత్రి 7 వరకు) కొనసాగింది. బండ్లగూడలోని 1,156 వన్బీహెచ్కే, టూబీహెచ్కే, త్రీబీహెచ్కే ఫ్లాట్ల లాటరీని మంగళవారం నిర్వహించనున్నారు. ఇక్కడ 345 త్రీబీహెచ్కే డీలక్స్ ఫ్లాట్లకు ఏకంగా 16,679 దరఖాస్తులు వచ్చినందున వాటికి బుధవారం ప్రత్యేకంగా లాటరీ తీస్తామని అధికారులు వెల్లడించారు. ఎక్కడా అనుమానాలకు తావులేకుండా లాటరీని పూర్తి పారదర్శకంగా నిర్వహించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని రికార్డ్ చేయడంతోపాటు యూట్యూబ్ , ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. లాటరీ తీసిన అనంతరం దరఖాస్తుదారుల పేర్లను, వారికి కేటాయించిన ఫ్లాట్ నంబర్లను బహిరంగంగా ప్రకటించడంతో పాటు డిజిటల్ డిస్ప్లేలో ప్రదర్శించారు. ఫ్లాట్లు దకించుకొన్న వారి పూర్తి వివరాలను ఈ నెల 29 సాయంత్రం నుంచి www.hmda. gov.in, www.swagruha.telangana.gov.in వెబ్సైట్లో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు.
డూప్లికేషన్లకు చెక్
ఒక వ్యక్తి ఒక్క ఫ్లాట్ పొందేందుకే అర్హుడని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఒక వేళ రెండు ఫ్లాట్లు వస్తే వాటిలో ఒకటి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన లాటరీలో కొందరికి రెండు, మూడు ఫ్లాట్లు రావడంతో ఆధార్ నంబర్ ఆధారంగా అధికారులు వెంటనే గుర్తించి వాటిని వేరేవారికి కేటాయించారు. పోచారంలో ఒకటి నుంచి నాలుగో ఫ్లోర్ వరకు ఒక్క త్రీబీహెచ్కే డీలక్స్ ఫ్లాట్ మాత్రమే పూర్తయింది. ఆ ఫ్లాట్ను దక్కించుకొనేందుకు ఏకంగా 1,193 మంది పోటీపడ్డారు. ఇదే క్యాటగిరీలో నాలుగు నుంచి ఆపై ఫ్లోర్ వరకు ఉన్న మరో త్రీబీహెచ్కే ఫ్లాట్ కోసం 442 మంది పోటీపడటం గమనార్హం. దీంతో లాటరీలో ఇద్దరు మాత్రమే పోచారం త్రీబీహెచ్కే డీలక్స్ (పూర్తయిన) ఫ్లాట్లను దక్కించుకోగలిగారు. బండ్లగూడలోని ఫ్లాట్లకు మంగళవారం ఉదయం 7.30 నుంచే లాటరీ మొదలు కానున్నది.