హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజన ప్రకియ ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ నెలలోనే ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. మార్గదర్శకాలు సిద్ధం కాగా, అతి త్వరలోనే వెలువడనున్నాయి. ఉద్యోగుల కేటాయింపులో భాగంగా మొదట అన్నిశాఖల్లోని వారికి ఆప్షన్లు ఇస్తారు. ఉద్యోగులు ఎంచుకొన్న ఆప్షన్ల ప్రకారమే బదిలీలు చేయనుండగా, సీనియార్టీని పరిగణనలోకి తీసుకొంటారు. ఆరోగ్యం, భార్యాభర్తలు వంటి ప్రత్యేక పరిస్థితులను స్పెషల్ క్యాటగిరీగా తీసుకొని బదిలీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఉద్యోగుల వర్గీకరణ, బదిలీల విధివిధానాలపై ఆదివారం సచివాలయంలో సీఎస్ సోమేశ్కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ అండ్ ఐజీ శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్తో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు సహదేవ్, ముజీబ్ హుస్సేనీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త జోన్లు, జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై వారు సీఎస్తో చర్చించారు.
ముందుగా ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో..
కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, కోడ్ అమల్లో లేని జిల్లాల్లో ముందుగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే క్యాడర్ల వారీగా ఉద్యోగులకు ఆప్షన్స్ ఇస్తామని సీఎస్ సోమేశ్కుమార్ ఉద్యోగ సంఘాలకు హామీనిచ్చారు. ప్రక్రియ సజావు సాగేందుకు టీజీవో, టీఎన్జీవో, ప్రభుత్వ గుర్తింపు పొందిన జిల్లా స్థాయి ఉద్యోగ సంఘాలను కేటాయింపు సమయంలో ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
నష్టం జరుగకుండా విభజన
ఉద్యోగులకు నష్టం జరుగకుండా విభజన చేపట్టాలని సీఎస్ను కోరాం. విభజనపై మా నుంచి సూచనలు, సలహాలు తీసుకొన్నారు. సీనియార్టీ నష్టపోకుండా ఉద్యోగులను విభజించాలని, ఏ జిల్లా ఉద్యోగులకు ఆయా జిల్లాకే కేటాయించాలని కోరాం. ఉద్యోగులెవరూ అధైర్యపడొద్దు. ఎవరికీ అన్యాయం జరుగదు.
క్లిష్టమైన సమస్యకు పరిష్కారం
ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు బాగున్నాయి. క్లిష్టమైన సమస్యకు సీఎం కేసీఆర్ సులభమైన పరిష్కారం చూపారు. బదిలీల కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఆప్షన్స్ ప్రక్రియంతా ఆఫ్లైన్లోనే ఉంటుంది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న దృఢసంకల్పంతో సీఎం ఉన్నారు. విభజన పూర్తికాగానే నోటిఫికేషన్లు జారీ చేస్తారు.