హైదరాబాద్ : సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం ( Singareni Scams ) పై హరీష్ రావు సంచలన ఆరోపణల నుంచి దృష్టిని మరల్చడానికే మంత్రులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) తెలిపారు. తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి తనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డీజీపీ ( DGP ) కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. సింగరేణిని సీఎం బామ్మర్దికి అప్పగించారని ఆరోపించారు. తనపై తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు ఉన్నాయని, సీసీఎస్ డార్క్ సెల్తో సహా హైదరాబాద్ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నానని వెల్లడించారు.సింగరేణి కార్మికులు, ప్రజల ఓట్లతో రెండు సార్లు గెలిచాను.ప్రజల దృష్టిని మరల్చడానికి తన వ్యాఖ్యలను చీప్ ట్రిక్ కింద వాడారని విమర్శించారు. .
సీఎం కార్యాలయం డైరెక్షన్ మేరకు తనను ట్రోల్ చేస్తున్నారని వివరించారు. మరోసారి తనపై కేసు పెట్టి జైలుకు పంపుతారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు . క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఇబ్బందులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. . ఫార్మా కంపెనీని కాలుస్తా అన్న జడ్చర్ల ఎమ్మెల్యేపై, నరుకుతా అన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్పై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నాడు ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చాలని పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడిన రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఏ వర్గం సంతృప్తిగా లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. శ్రీలంకలో,బంగ్లాదేశ్ లో ప్రజలు తిరగబడునట్లు తెలంగాణలోను ప్రజల తిరుగుబాటు వస్తుందని వెల్లడించారు.
సీఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించే లోగా రైతుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,పల్లె రవికుమార్ , కురువ విజయ్ కుమార్ , తుంగ బాలు , పడాల సతీష్ రాజేష్ ,రవీందర్ రెడ్డి ,హరిబాబు తదితరులు పాల్గొన్నారు.