ఎల్బీనగర్, మే 26: కరోనా సంక్షోభం బత్తాయి రైతుకు కలిసొచ్చింది. ప్రస్తుత వేసవిలో ఈ పండ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొవిడ్ను అధిగమించాలంటే సీ విటమిన్ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను విరివిగా వినియోగించాలన్న వైద్యనిఫుణుల సూచనలే ఇందు కు కారణం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజ లు బత్తాయిపై ఆసక్తి కనబర్చడంతో ఈ పండ్లకు ఎనలేని గిరాకీ పెరిగింది. రాష్ట్రంలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ అయిన ‘గడ్డి అన్నారం’లో బత్తాయి ధర ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. బుధవారం వేలంలో టన్ను ప్రీమియంరకం ధర రూ.96 వేలు పలికింది. సాధారణ (మోడల్) రకానికి గరిష్ఠంగా రూ.70 వేలు, కనిష్ఠంగా రూ.50 వేల ధర లభించింది. కానీ ఈ నెల 17న ప్రీమియం రకం ధర రూ.లక్ష దాటినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎస్జీఎస్ ప్రవీణ్రెడ్డి తెలిపారు. గడ్డి అన్నారంలో బత్తాయి ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం తదితర ప్రాంతాల్లో బత్తాయి సాగు అధికంగా జరుగుతున్నది. ఈ ఏడాది వ్యాపారులు నేరుగా రైతులతో మాట్లాడుకొని ఉత్తరాది రాష్ర్టాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తోపాటు తమిళనాడుకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల నల్లగొండలో బత్తాయి మార్కెట్ ఏర్పడటంతో అక్కడి నుంచి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ వేసవి సీజన్ సమయంలో హైదరాబాద్లోని గడ్డి అన్నారం మార్కెట్ యార్డుకు రోజూ దాదాపు 400 టన్నుల సరుకు రావాల్సి ఉండ గా.. కేవలం 150 టన్నులకు మించి రావడంలేదు. మరోవైపు కరోనా మహమ్మారి నేపథ్యంలో బత్తాయి వినియోగం కూడా అధికమవడంతో ధరలు భారీగా పెరిగాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలో సాగయ్యే బత్తాయికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది. నాణ్యతా ప్రమాణాల్లో ఈ బత్తాయి ఉత్తమంగా ఉండటం దీని ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కావొచ్చని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
గడ్డి అన్నారం యార్డు లో బత్తాయికి ఎనలేని గిరాకీ ఏర్పడింది. యార్డు కు సరుకు రాక తగ్గడం తో ధరలు భారీగా పెరిగా యి. ప్రస్తుతం రోజూ వస్తున్న సరుకు 150 టన్నులు మించడంలేదు. ఫలితంగా గత నెలరోజులుగా రూ.90 వేలు పలుకుతున్న టన్ను ధర ఈ నెల 17న రూ.లక్ష దాటింది.
–ప్రవీణ్రెడ్డి, ఉన్నత శ్రేణి కార్యదర్శి,గడ్డి అన్నారం మార్కెట్
టన్ను బత్తాయి రూ. లక్ష పలుకడం గడ్డిఅన్నా రం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. కొవిడ్ నేపథ్యంలో ఈ పండ్ల వినియోగం అధికమవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బత్తాయి పంటకు పూత సమయంలో వర్షాలు పడటంతో పూత రాలి, దిగుబడి తగ్గింది. మార్కెట్కు రోజూ 150 టన్నులే వస్తున్నది. నిరుడు టన్ను ప్రీమియం రకం గరిష్ఠంగా రూ.30 వేలు, కనిష్ఠంగా 8 వేలు, మోడల్ రకం రూ.20 వేలు మాత్రమే పలికింది.
–అఫ్సర్ బాయ్, వ్యాపారి, గడ్డి అన్నారం