హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చాల్సిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖకు ఇన్చార్జి అనే గ్రహణం పట్టింది. ఫలితంగా ఫైళ్ల్లు గుట్టలుగా పేరుకుపోతుండగా, పాలన అస్తవ్యస్తంగా మారింది. ఒకే అధికారికి అపరిమితమైన బాధ్యతలు అప్పగించడం, పూర్తిస్థాయి డైరెక్టర్లు లేకపోవడం వల్ల పల్లెల ప్రగతిచక్రం చతికిలపడింది. కీలకమైన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవోగా, సీఎం ప్రజావాణి రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) సీఈవోగా విధులు నిర్వర్తిస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉన్న దివ్యాదేవరాజన్కు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పీఆర్ఆర్డీ డైరెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించింది. ఒక్కో కీలక శాఖకు పూర్తి సమయం కేటాయించాల్సిన పరిస్థితుల్లో, పనిభారం కారణంగా పీఆర్శాఖకు ఆమె రోజుకు కనీసం 2-3 గంటలు కూడా సమయం కేటాయించలేకపోతున్నారు.
సీఎం ప్రజావాణి రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా మంగళ, శుక్రవారాల్లో పూర్తి సమయం ప్రజాభవన్లో ప్రజల ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. మిగతా రోజుల్లో వివిధ రకాల వినతులు ఇచ్చేందుకు ఆమె ఉండే సెర్ప్, మెప్మా కార్యాలయాలకు అధికార పార్టీ నేతలు వెళ్లేవారు. తమ ఫైల్స్ చూడలేకపోతున్నారని, వినతులు ఇచ్చేందుకు వచ్చే నాయకులతో తమ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయని ఆయా శాఖల అధికారులు ఆవేదన వ్యక్తంచేసేవారు. దీనివల్ల వందలాది కీలక ఫైళ్లు సంతకాలు లేక పెండింగ్లో పడిపోతున్నాయని వాపోయేవారు. ఇంత కీలకమైన విభాగాలకు అధిపతిగా దివ్యాదేవరాజన్ ఉంటూ నిత్యం బిజీగా గడిపే ఆమెకే మరో అత్యంత ప్రధానమైన పీఆర్ఆర్డీశాఖ ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించడం మరింత పనిభారం పెరిగింది. అధిక వర్క్లోడు కారణంగా ఆమె ఏ ఒక్క పని మీద ప్రత్యేక దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
రెండేండ్లలో ఐదుగురు డైరెక్టర్లు.. ఇదో రికార్డు!
పంచాయతీరాజ్శాఖలో అస్థిరత ఏ స్థాయిలో ఉందంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాలంలోనే ఐదుగురు డైరెక్టర్లు మారారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి పీఆర్ఆర్డీ డైరెక్టర్గా ఎం హనుమంతరావు ఉన్నారు. ఆయనను రెండు నెలలకే బదిలీ చేశారు. ఆ తర్వాత అనితారామచంద్రన్ను నియమించారు. ఆమెను కూడా 8 నెలలకే ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం డాక్టర్ జీ సృజనను డైరెక్టర్గా నియమించారు. ఈమె ఒక్కరే ఏడాదికిపైగా పనిచేశారు. కీలకమైన పంచాయతీ ఎన్నికలను పూర్తిచేశా రు. ఆ తర్వాత ఆమెకు కూడా స్థానచలనం కల్పించారు. అనంతరం శృతి ఓఝాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమెను కూడా రెండు నెలల్లోనే బదిలీ చేశారు. గత నెల 11నుంచి దివ్యాదేవరాజన్ ఎఫ్ఏసీగా కొనసాగుతున్నారు.
ప్రభుత్వం పాలనాపరమైన అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినప్పటికీ, ఆరు నెలలకోసారి మార్పు జరగడం పాలనపై ప్రభావం చూపుతున్నది. అధికారులు రావడం, శాఖను అర్థం చేసుకునేలోపే బదిలీ అవ్వడం వల్ల పాలన కుంటుపడింది. ఈ మ్యూజికల్ చైర్ ఆట వల్ల అటు సిబ్బందికి, ఇటు ప్రజలకు దికుతోచని పరిస్థితి ఏర్పడిం ది. కమిషనర్ ఆఫీసు చుట్టూ ఫైళ్లతో తిరుగుతున్న కిందిస్థాయి సిబ్బంది అధికారుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. ఎఫ్ఏసీల పాలన వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతూ శాఖాపరమైన క్రమశిక్షణ కూడా తప్పుతున్నది. పల్లెలే దేశానికి వెన్నెముక అని చెప్తున్నా, ఆ పల్లెలను పాలించేశాఖ మాత్రం పక్షవాతం వచ్చినట్టు తయారైంది. పల్లె సీమల అభివృద్ధిని గాలికొదిలేసి, మొకుబడిగా పాలన సాగిస్తున్న తీరుపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి పంచాయతీరాజ్ శాఖకు ఒక ప్రత్యేకమైన, పూర్తిస్థాయి డైరెక్టర్ను నియమించి, నిలిచిపోయిన ఫైళ్లకు మోక్షం ప్రసాదించాలని పల్లెప్రజలు కోరుతున్నారు.
ఒకే అధికారి దివ్యాదేవరాజన్ నాలుగు బాధ్యతలు