హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. 2023-24 బడ్జెట్లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ప్రస్తుతం రూ.90 వేల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని వివరించారు. ఆదివారం శాసనసభలో ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, గణేశ్ బిగాల, నలమోతు భాసర్రావు, ఆశన్న గారి జీవన్ రెడ్డి, అంజయ్య యాదవ్, దుర్గం చిన్నయ్య, పొడెం వీరయ్య, భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2014లో ఇచ్చిన హామీ మేరకు 35.81 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. 2018లో రూ.21,556 కోట్లు అవసరమని అంచనా వేశామని గుర్తుచేశారు. ఇప్పటివరకు 5.42 లక్షల మంది రైతులకు రూ.36 వేల వరకు రుణాలను మాఫీ చేశామని చెప్పారు.
కొల్లాపూర్లో పండ్ల మార్కెట్
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధి రాంపూర్లో రూ.5.45 కోట్లతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు నిరంజన్రెడ్డి ప్రకటించారు. త్వరలో అక్కడ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కోహెడ మార్కెట్ నిర్మాణ పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.