చిక్కడపల్లి, ఫిబ్రవరి 24: వామపక్ష, ప్రగతిశీల శక్తులతోనే ప్రపంచశాంతి, అభివృద్ధి సాధ్యమని వామపక్ష, సోషలిస్టు పార్టీల విదేశీ ప్రతినిధులు పేర్కొన్నారు. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం (రెండోరోజు) సభకు విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. జియాన్జున్ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా), న్గుయోన్ థాన్హై (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాం), రోజాస్ మెడిన మలేనా (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా), చోహుయ్ చోల్, కిమ్ మయోంగ్ చోల్ (వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా), ఉదయ్ రాజ్ పాన్డే, యువరాజ్ బాస్కోట (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్), సైపుల్ హాక్, బాహ్యనిషిక జమళి (రివోల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్), వన్మనీ బౌంమి(లావో ప్యూపిల్స రివోల్యూషనరీ పార్టీ-లావోస్ ), బిమల్ రత్నయకే(ప్యూపిల్స్ లిబరేషన్ ఫ్రంట్-శ్రీలంక) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలో మానవ, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్య హక్కులు అణగదొక్కుతున్నారని ఆరోపించారు. సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యదర్శి జీ దేవరాజన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిస్వాస్, తెలంగాణ అధ్యక్షుడు ఆర్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.