నల్లగొండ, డిసెంబర్ 2 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫాల్స్ సర్వేలని, అవేవీ నిజం కావని అన్నారు. శనివారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సర్వేలన్నీ కొన్నిసార్లు బూమరాంగ్ అవుతాయని తెలిపారు. ఆదివారం నిర్వహించే కౌంటింగ్లో బీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను అక్రమించుకోవడం దుర్మార్గపు చర్య అని, దీన్ని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రా మెయింటెనెన్స్లో, సాగర్ జలాశయం తెలంగాణ నిర్వహణలో ఉన్నదని తెలిపారు. కానీ.. ఏపీ ప్రభుత్వం ఇలా దురాక్రమణ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ తీరు రెండు రాష్ట్రాల ప్రజల సామరస్య వాతావరణానికి విఘాతం కలిగేలా ఉన్నదని అన్నారు. ఆంధ్రా సర్కారు దురాలోచనతో సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకున్నదని, కృష్ణా రివర్ బోర్డు ఆదేశించినా ఏపీ పోలీసులు వెనకి వెళ్లకపోవడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల పరిధిలో ఉండే హకులను కేంద్రం చేతుల్లోకి వెళ్లే విధంగా ఏపీ ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు.