హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తన కవితలు, బొమ్మలతో సమాజాన్ని కదిలించి, ఆలోచింపజేసిన దివంగత ప్రముఖ తెలుగు కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వ్యక్తులపై ద్వేషం చిమ్మకుండా, హింసను ప్రేరేపించకుండా అందరికీ అర్థమయ్యేలా కవితలు రాయడంలో దిట్ట అయినా, ప్రభాకర్ చివరి వరకు సాదాసీదాగా జీవించారు.
సమాజాన్ని మేల్కొల్పిన ఆయన సేవలను తెలంగాణ సర్కారు ఏటా స్మరించుకొంటున్నది. అలిశెట్టి జయంతి, వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన అలిశెట్టి కుటుంబసభ్యులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ ఆర్థిక స్థితిగతులను అధికారులు మంత్రి కేటీఆర్కు వివరించారు. అలిశెట్టి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సొంతిల్లు విషయంలో సహకారం అందిస్తామని మంత్రి హామీఇచ్చారు.