హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వరి పైరుకు కాండంతొలుచు పురుగు సోకుతున్నది. ఈ పురుగు అధిక ఉధృతి వల్ల పైరు ఎర్రబారుతున్నది. వరి పైరును కాపాడుకునేందుకు రైతులు ఎడాపెడా పురుగు మందులను వినియోగిస్తున్నారు. పురుగు మందు దుకాణాల నిర్వాహకుల సూచనలతో ఇష్టారీతిన మందులను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కాండం తొలిచే పురుగు సోకిన పైరులో తీసుకునే సస్యరక్షణ చర్యలను, వాడే రసాయన మందులను వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వివరిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక వీడియోను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఇందులో కీటక శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త ఎస్ రామగోపాలవర్మ రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.
నాటు వేసే దశలో..
ఒక ఎకరాకు కార్బో ఫ్యూరాన్ 3జీ 800 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 0.3జీ 600 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 0.6జీ 400 గ్రాముల గుళికలను చల్లాలి. ఈ సమయంలో పొలంలో పలుచగా నీరు ఉంచి ఇంకి పోయేలా చేయాలి. ఈ గుళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియాలో కలిపి చల్లొద్దు.
15 నుంచి 20 రోజుల వ్యవధిలో..
ఒక ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3జీ 10 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3జీ 8 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.6జీ 4 కిలోల గుళికలను చల్లాలి. వీటిని 20-25 కిలోల ఇసుకతో కలిపి పొలం మొత్తం సమానంగా చల్లాలి. ఈ గుళికలనూ యూరియాతో కలిపి చల్లొద్దు.
30 నుంచి 40 రోజుల దశలో..
ఈ దశలో గుళికలను కాకుండా పిచికారీ మందులను వినియోగించాలి. ఫిప్రోనిల్-5 శాతం 2 మిల్లీలీటర్లు లేదా కార్బోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు ప్రతీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి సమానంగా పిచికారీ చేయాలి.