హైదరాబాద్, ఫిబ్రవరి8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. చర్చలో పాల్గొన్న పలు పార్టీల సభ్యులు రాష్ట్ర బడ్జెట్ అద్భుతమని ప్రశంసించారు. రాష్ట్ర బడ్జెట్పై చర్చను బుధవారం అసెంబ్లీలో అక్బరుద్దీన్ ప్రారంభించారు. బడ్జెట్పై హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను కేంద్రం ఎత్తేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు. వక్ఫ్బోర్డు రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని కోరారు.
పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా పిలిచి ఆరు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించడంపై ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నయా షహర్ మాదిరిగా పురానా షహర్ పురోభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం కలిగిందని వెల్లడించారు. పాతబస్తీలోని లాల్దర్వాజ ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.20 కోట్లను మంజూరు చేశారని, ఆ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటును ప్రశంసించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు, నిర్వహణలో ఎన్ని కష్టాలు ఉంటా యో తమకు తెలుసని, అయినప్పటికీ ప్రభుత్వం దానిని సవాల్గా తీసుకొని ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు.
తెలంగాణకు తీరని ద్రోహం : భట్టివిక్రమార్క
తెలంగాణ ఏర్పాటు తరువాత ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన అతి భారీ బడ్జెట్ అని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర పద్దు లక్ష కోట్లతో మొదలై రూ. 2,90,396 కోట్లకు చేరుకున్నదని తెలిపారు. అయితే కొన్ని అంకెలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, బడ్జెట్లో పలు రంగాలకు కేటాయింపులు, చేసిన ప్రతిపాదనలను విమర్శించారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరని ద్రోహం చేస్తున్నదని ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపులో బీజేపీ పాలిత రాష్ర్టాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్నదని మండిపడ్డారు. విభజన హామీలను కూడా అమలు చేయడం లేదని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధుల కోతల ద్వారా రాష్ట్ర బడ్జెట్పై, తద్వారా తెలంగాణ ప్రజానీకం తీవ్ర ప్రభావం పడుతున్నదని వెల్లడించారు.
మృతులకు నివాళి
అసెంబ్లీలో బుధవారం బడ్జెట్పై చర్చకు ముందుగా మాజీ సభ్యుల మృతికి సభ సంతాపం తెలిపింది. మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణరెడ్డి, గడ్డం రుద్రమదేవిల మృతిపై సభ్యులు సంతాపం తెలియజేశారు. వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం బడ్జెట్పై చర్చను ప్రారంభించారు.
పద్మాదేవేందర్రెడ్డి కవితలు
బడ్జెట్ చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ సభ్యురాలు పద్మా దేవేందర్రెడ్డి తన కవితలతో రాష్ట్ర ప్రగతిని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం, ఆ తరువాత రాష్ట్ర పరిస్థితిని ఆమె ఈ కవిత ద్వారా కండ్లకు కట్టారు.
కరువు కాటకాల కాన..
వలసవాదుల ఠాణా.. నా తెలంగాణ
దగాపడిన జాన..
తీగ తెగిన వీణ.. నా తెలంగాణ
కోటి ఎకరాల మాగాణం.. నా తెలంగాణ
దేశానికే ధాన్య భోషాణం.. నా తెలంగాణ
రైతన్నకు రైతుబంధు
ఆలంబన.. నా తెలంగాణ
బడుగు బలహీనవర్గాలకు
ఆదరణ.. నా తెలంగాణ
అంటూ కొనియాడారు. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదల వల్లనే తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని అన్నారు.