అభివృద్ధిలో దేశానికి దారి దీపంలా మారిన తెలంగాణపై కేంద్రం అంతులేని కక్ష.. వివక్ష ప్రదర్శిస్తున్నది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మెట్రో విస్తరణకు సాయం చేసేందుకు ససేమిరా అంటున్నది. మిగతా రాష్ర్టాల్లో ఏర్పాటయ్యే మెట్రోలకు సహకరిస్తూ, తెలంగాణకు మాత్రం నిధులు ఇవ్వటం లేదు. మెట్రో రెండో దశకు సహకరించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో సహా నలుగురు ఎంపీలు ఉన్నా తెలంగాణకు అదనంగా ఒరిగిందేమీ లేదు. కేంద్రం సహకరించకున్నా సొంత నిధులతో మెట్రో రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. రూ.6,250 కోట్లతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రజా రవాణాలో మెట్రో రైలు కీలకపాత్ర పోషిస్తున్నది. భారత్లో తొలిసారి 1984లో కోల్కతాలో 3.4 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో నిర్మించారు. ఆ తర్వాత 2014 వరకు ఐదు నగరాల్లో 249 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా, వీటిలో కొన్ని పూర్తయితే, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. 2014 కంటే ముందే తెరపైకి వచ్చిన ప్రాజెక్టుల్లో హైదరాబాద్ మెట్రో రైలు ఒకటి. 2007లో రూ.14,100 కోట్ల అంచనాతో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేపట్టిన ఈ ప్రాజెక్టులో కేంద్ర వాటా 10 శాతమే (రూ.1,458 కోట్లు). వయబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద సమకూర్చేందుకు అప్పట్లో అంగీకరించినా, ఇప్పటివరకు రూ.254 కోట్ల బకాయిలు చెల్లించలేదు. 2017లో ప్రధాని మోదీ హైదరాబాద్ మెట్రోను ప్రారంభించగా, ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల మేర రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా రెండో దశను 31 కిలోమీటర్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎల్బీనగర్-నాగోలు (5 కి.మీ.), లింగంపల్లి- లక్డీకాపూల్ (26 కి.మీ.) మొత్తం 31 కి.మీ.కు రూ.8,500 కోట్ల అంచనాతో రూపొందించిన ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరింది. మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా సరైన స్పందన లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం సహకరించకున్నా మెట్రో ఆగొద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రోను రూ.6,250 కోట్లతో నిర్మించేందుకు సిద్ధమైంది.
మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం 10 గంటలకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్ స్పేస్ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ(టీఎస్పీఏ)లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
మొదటిదశ మెట్రో బకాయిలు చెల్లించని కేంద్రం.. రెండోదశపైనా నిర్లక్ష్యం వహిస్తుందన్నది వాస్తవం. మహారాష్ట్రలో ప్రస్తుతం 245 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చిన, నిర్మాణంలో ఉన్న వాటిలో 21.28%అంటే సుమారు రూ.19వేల కోట్లకు పైగా కేంద్రం వాటా ఉన్నది. ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లకు పైగా ఉంటే ఇందులోనూ దాదాపు 25% ఉన్నది. నోయిడా రెండుదశల మెట్రో ప్రాజెక్టుల్లో కేంద్రం సగం వరకు భరిస్తున్నది. చెన్నైలో 16.60%, గుజరాత్లో 20%, ఉత్తరప్రదేశ్లో 25 శాతం, రాజస్థాన్లో 26 శాతం, బెంగళూరు రెండు దశల్లో 31 శాతాన్ని కేంద్రం భరిస్తున్నది. కొచ్చి, బెంగళూరు, చెన్నై, నాగపూర్, నాసిక్ల్లో మెట్రో రెండోదశ ప్రాజెక్టులకు నిధులిచ్చింది. ఇంకా ప్రతిపాదనల్లో ఉన్న ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్, హరిద్వార్, రిషికేశ్ ప్రాజెక్టుల్లోనూ భారీగా నిధులిచ్చేందుకు మోదీ సర్కారు సుముఖంగా ఉన్నది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిన అందుబాటులోకి వచ్చిన మెట్రోరైల్ ప్రాజెక్టులో హైదరాబాద్ది రెండోస్థానం. ఢిల్లీలో 351 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు తీస్తుండగా, హైదరాబాద్లో మూడు మార్గాల్లో 69 కి.మీ. పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. హైదరాబాద్ తర్వాత బెంగళూరు (56.1 కి.మీ), చెన్నై (54.65 కి.మీ.), కోల్కతా (33 కి.మీ), నోయిడా (30 కి.మీ)లో మెట్రో నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్లో పూర్తయిన 3 కారిడార్లలో నిత్యం 4 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతున్నారు. దీని నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురైనా ఇంజినీర్లు,అధికారులు అధిగమించి నగరవాసుల మెట్రో కలను సాకారం చేశారు. మరిన్ని ప్రాంతాలకు మెట్రో సేవలు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో రెండోదశను ప్రారంభించనున్నది. ఈ దశలో రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు (31కి.మీ), బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ (26 కి.మీ.), నాగోలు-ఎల్బీనగర్ (5 కి.మీ.) మొత్తం 62 కిలోమీటర్లు విస్తరించేందుకు డీపీఆర్లను సిద్ధం చేసింది. భవిష్యత్తులో 2041 నాటికి మొత్తం 204 కి.మీ మేర మెట్రో మార్గాలను నిర్మించేందుకు హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ(ఉమ్టా) ప్రతిపాదనలు రూపొందించింది.
మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు (31 కి.మీ.) వరకు కేవలం 26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్ మెట్రో రైల్ ఏర్పాట్లు చేస్తున్నది. విమానాశ్రయానికి త్వరగా చేరేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. పిల్లర్లతోపాటు 2.5 కిలోమీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని నిర్మించనున్నది. అవుటర్ రింగ్రోడ్డు వెంట నిర్మించే ఈ మార్గంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్ టెక్నాలజీని వినియో గించనున్నారు. ప్రస్తుత మెట్రో స్టేషన్ల కంటే ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్లు క్లోజ్డ్ సర్క్యూట్తో ఉంటాయి. రైలు వచ్చినప్పుడే ప్లాట్ఫాం గేట్లు తెరుచుకొంటాయి. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు 8-9 స్టేషన్లు ఉండనున్నాయని, కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా ఉంటాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మూడేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారని ఆయన చెప్పారు.