హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గస్థానానికి నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. త్రిపురరి ఆనంత నారాయణ్, డాక్టర్ వీ నాథన్ లాల్, డాక్టర్ గాధ దాసు వెంకటేశ్వర్లు నామినేషన్ పత్రాలను ఆర్వో ప్రియాంక అలాకు అందజేశారు. మొత్తం 21 మంది అభ్యర్థులు 57 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, 27న నామినేషన్ల విత్ డ్రా, మార్చి 13న పోలింగ్, 16న కౌంటింగ్ ఉంటుంది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 21 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి రెండు నామినేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. ఏఐఎంఐఎం పార్టీ తరఫున మీర్జారహమత్బేగ్ మూడు సెట్లను, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మహమ్మద్ రహీంఖాన్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని, మహమూద్అలీ, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎంఐఎం పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.