హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని ఎయిమ్స్ను దేశంలోనే ప్రతిష్ఠాత్మక దవాఖానగా చెప్తుంటారు. ప్రధాని మొదలు ఢిల్లీలోని పెద్దలకు, ఇతర రాష్ర్టాల్లోని కీలక నేతలకు, బడా రాజకీయ, వ్యాపారవేత్తలకు ఏ జబ్బు వచ్చినా ఈ ఎయిమ్స్కు వెళ్తుంటారు. అంతటి ప్రతిష్ఠాత్మక దవాఖానలోనూ సరిపడా సిబ్బందిని నియమించలేదంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ఎయిమ్స్లో ఫ్యాకల్టీ 31 శాతం, నాన్ ఫ్యాకల్టీ 17 శాతం, సీనియర్ రెసిడెంట్ 34 శాతం, జూనియర్ రెసిడెంట్ పోస్టులు 20 శాతం ఖాళీగా ఉన్నాయి. రానురాను ఢిల్లీ ఎయిమ్స్పై ఒత్తిడి పెరుగుతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో పోస్టుల సంఖ్య పెంచాల్సిందిపోయి ఖాళీగా ఉంచడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలోని బీబీనగర్ సహా దేశవ్యాప్తంగా 19 ఎయిమ్స్ దవాఖానలు ఉన్నాయి. వీటన్నింటినీ గణిస్తే ఫ్యాకల్టీ పోస్టుల్లో దాదాపు 51 శాతం ఖాళీగా ఉన్నాయి. నాన్ ఫ్యాకల్టీ పోస్టుల్లోనూ సగం ఖాళీలే ఉన్నట్టు స్వయంగా కేంద్రమే చెప్పింది. జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులదీ ఇదే పరిస్థితి. బీబీనగర్ ఎయిమ్స్ను గొప్పగా తీర్చిదిద్దుతున్నామంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నేతలంతా ప్రచారం చేసుకొంటున్నారు. కానీ ఇదంతా అబద్ధమని స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి.