హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ (హెచ్ఏఐ) నియంత్రణ అనేది హెల్త్కేర్లో సవాలుగా మారుతున్నదని, దేశంలోనే కాకుండా అభివృద్ధి చెందిన యూఎస్, యూకే వంటి దేశాల్లో సైతం ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఏఐజీ దవాఖాన ఆధ్వర్యంలో ‘హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ (హెచ్ఏఐ) కంట్రోల్పై నిర్వహించిన వార్షిక సదస్సును నాగేశ్వర్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో సుమారు 10 శాతం మంది రోగులు వివిధ అనారోగ్య కారణాలతో దవాఖానల్లో చేరి, చికిత్స పొందడం వల్ల మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్కు గురవుతున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయని చెప్పారు. దీనికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రమాణాలను దవాఖానల సిబ్బంది పాటించకపోవడం, రోగి సహాయకులకు ఇన్ఫెక్షన్స్పై అవగాహన లేకపోవడమేనని వివరించారు. ఇటువంటి ఇన్ఫెక్షన్లు కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితివరకు చేరుస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా దవాఖానల్లో సిబ్బందికి ఇన్ఫెక్షన్ నియంత్రణపై తగిన శిక్షణ ఇప్పించి, అవగాహన కల్పించాలని సూచించారు. హాస్పిటల్ ఇన్ఫెక్షన్ నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలాంటి కమిటీ ఏఐజీలో ఉండటం వల్లే దేశంలోనే హెచ్ఏఐ అతి తక్కువ రేటును కలిగి ఉన్నట్టు వివరించారు. కరోనా సమయంలో తమకు ఈ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ఒక రోగి నుంచి మరో రోగికి క్రాస్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా డిస్పోజబుల్ ఎండోస్కోప్స్ను అందుబాటులోకి తీసుకొచ్చి మరో ముందడుగు వేసిందని వివరించారు. ఈ సదస్సులో 400కు పైగా వైద్యనిపుణులు పాల్గొని తమ తమ అనుభవాలను పంచుకొన్నారు. సదస్సులో ఏఐజీ డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ పీ రెడ్డి పాల్గొన్నారు.