హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): భారత అటవీ పరిశోధన విద్యామండలి (ఐసీఎఫ్ఆర్ఈ) డెహ్రాడూన్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీదూలపల్లి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శుక్రవారం అరణ్యభవన్ కేంద్రంగా జరిగిన ఈ ఒప్పందం మేరకు అటవీ సంబంధిత విషయాలపై అధ్యయనానికి, సిబ్బంది శిక్షణకు సంస్థలు కలిసి పని చేయనున్నాయి. ఈ సందర్భంగా అటవీ పరిశోధన విద్యా మండలి డైరెక్టర్ జనరల్ ఏఎస్ రావత్ మాట్లాడుతూ ఒప్పందం నేపథ్యంలో తెలంగాణ వాతావరణం, వృక్ష జాతులు, అటవీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ను కోరారు. వేప చెట్లకు వస్తున్న తెగుళ్లపై అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, పీసీసీఎఫ్(ఎఫ్ఏసీ) ఎంసీ పర్గెయిన్, ఐఎఫ్బీ డైరెక్టర్ ఈ వెంకట్రెడ్డి, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ ఆశ, సీసీఎఫ్ రామలింగం, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
అటవీ జీవ వైవిధ్య సంస్థదూలపల్లి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రి వర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని అగ్రి వర్సిటీలో ఈ కార్యక్రమం జరగ్గా, ఒప్పంద పత్రాలపై రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్, అటవీ జీవవైవిధ్య సంస్థ డైరెక్టర్ ఈ వెంకట్రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా అటవీ వ్యవసాయంలో చేపట్టవలసిన పరిశోధనలు, కార్యక్రమాలకు ఊతం లభిస్తుందని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.