హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు వర్సిటీల వీసీలను ఎంపిక చేసే సెర్చ్ కమిటీల నియామక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడున్న వైస్చాన్స్లర్లు మళ్లీ వీసీ పోస్టుకు దరఖాస్తు చేయడం.. వారి అధ్యక్షతనే సెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఉండే పాలకమండలి నామినీని ఎంపిక చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 10 వర్సిటీలకు కొత్త వీసీల నియామక ప్రక్రియకు ఆశావహుల నుంచి దరఖాస్తులు కోరగా 1,382 దరఖాస్తులొచ్చాయి. ఈ దరఖాస్తులన్నీ 312 మంది నుంచి వచ్చినవే! ఒక్కొక్కరు రెండు మూడింటికి దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిసింది.
వీసీల నియామక ప్రక్రియను సెర్చ్ కమిటీ చేపడుతుంది. యూజీసీ నామినీ, పాలకమండలి, నామినీ (ఈసీ), ప్రభుత్వ నామినీలతో సెర్చ్ కమిటీ ఏర్పడుతుంది. వర్సిటీ పాలకమండలి (ఈసీ) నామినీల ఎంపిక కోసం ఇటీవలే ప్రత్యేకంగా ఈసీ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించారు. ఒక్కో వర్సిటీ నుంచి ఒకరిని నామినీగా ఎంపిక చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నామినీల కోసం ఉన్నత విద్యాశాఖ అధికారులు యూజీసీకి లేఖను రాశారు. ఇక ప్రభుత్వ నామినీల ఎంపిక పూర్తికావడంతో సెర్చ్ కమిటీలు ఏర్పాటవుతాయని, ఉత్తర్వులు జారీచేయడమే తరువాయి అని అంతా అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నది.
రాష్ట్రంలోని 10 వర్సిటీల వైస్చాన్స్లర్లలో 9 మంది మళ్లీ వీసీ పోస్టుకు దరఖాస్తు చేశారు. ఒక్క జేఎన్ఎఫ్ఏయూ వీసీ తప్పా అంతా మళ్లీ ఏదో ఒక వర్సిటీ వీసీ పోస్టుకు పోటీపడుతున్నారు. ఇప్పుడున్న వీసీల అధ్యక్షతన ఎంపిక చేసిన ఈసీ నామినీలు వారి పట్ల సానుకూలంగా వ్యవహరించే అవకాశముందన్న వాదనలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సెర్చ్ కమిటీల్లో చేర్చే పాత నామినీలను పక్కనపెట్టారు. వర్సిటీల పాలకమండళ్ల గడువు ఫిబ్రవరి 27తో ముగిసింది. ఈ గడువు ముగిసేలోపే ఈసీ నామినీలను ఎంపిక చేయాలన్న తొందరలో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ఈసీ సమావేశాలను నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయం మారడంతో కథ మొదటికొచ్చింది.