Warangal | కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. తన కూతుర్ని పెండ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన స్నేహితుల ఇండ్లపై దాడి చేశాడు. పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లికి చెందిన మండల రవీందర్ కూతురు కావ్యశ్రీ.. అదే గ్రామానికి చెందిన జాలిగం శ్రీనివాస్ కుమారుడు రంజిత్ రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఏడాది క్రితం తెలియడంతో కావ్యశ్రీని ఆమె తల్లిదండ్రులు మందలించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదని వార్నింగ్ ఇచ్చారు. హనుమకొండ హసన్పర్తిలోని ఎస్ఆర్ కాలేజీలో బీటెక్లో చేర్పించారు. అక్కడే హాస్టల్లో ఉంచారు. కానీ రంజిత్ను కావ్యశ్రీ మరిచిపోలేదు. అతనితో కాంటాక్ట్లోనే ఉంది.
కులాలు వేరుకావడంతో పెద్దలు తమ పెండ్లికి ఒప్పుకోరని నిర్ణయించుకున్న కావ్యశ్రీ.. గత నెల 30న రంజిత్తో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఈ విషయం తెలియడంతో తమ కూతురు కనిపించడం లేదని కావ్యశ్రీ కుటుంబసభ్యులు హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన చిలుకూరు బాలాజీ ఆలయంలో కావ్యశ్రీ – రంజిత్ పెండ్లి చేసుకున్నారు.
అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో హసన్పర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో ఇరువురి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రేమ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ వాళ్లు తల్లిదండ్రుల మాట వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ కూతురికి మాయమాటలు చెప్పి తమకు కాకుండా చేశారని కావ్యశ్రీ తల్లిదండ్రులు రంజిత్పై కోపం పెంచుకున్నారు. స్టేషన్ నుంచి నేరుగా ఇటుకాలపల్లికి చేరుకుని రంజిత్ ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
రంజిత్ తండ్రికి చెందిన మిర్చి బండికి కూడా నిప్పు పెట్టారు. అయినా వాళ్ల ఆగ్రహం తగ్గలేదు. దీంతో రంజిత్కు సహకరించిన అతని స్నేహితులు సామల రాకేశ్, బొడ్డుపల్లి విజయ్, బూస ప్రవీణ్ ఇండ్లకు కూడా వెళ్లి సామగ్రి ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటనాసమయంలో ఇండ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. రంజిత్, అతని స్నేహితుల ఇండ్లపై దాడికి పాల్పడ్డ 10 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.