హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుట ఈ నెల 25న హాజరుకావాలని న్యాయవాది పోగులకొండ ప్రతాప్గౌడ్ను హైకోర్టు ఆదేశించింది. సిట్ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్కు ఆదేశాలు ఇవ్వాలని ప్రతాప్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. సిట్ జారీచేసిన నోటీసుల్లో పేరొన్న మేరకు శుక్రవారం సిట్ దర్యాప్తునకు ప్రతాప్ సహకరించాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో ప్రతాప్ను అరెస్టు చేయరాదని సిట్ను ఆదేశించారు. సిట్ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలకు అనుగుణంగా ప్రతాప్ వ్యవహరించాలని సూచించారు. నోటీసులోని అంశాలను ప్రతాప్ అమలు చేయకపోతే సిట్ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు.
సిట్ కస్టడీకి నిరాకరణ
నాంపల్లి క్రిమినల్ కోర్ట్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను సిట్ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నిరాకరించింది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇచ్చినందున సిట్ అభ్యర్థనను ఆమోదించలేకపోతున్నట్టు ఏసీబీ కోర్టు జడ్జి రాజగోపాల్ తెలిపారు. నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజిని విచారించాల్సి ఉన్నదని, వారిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ సిట్ కోర్టును కోరింది. ఒకసారి కస్టడీకి ఇచ్చాక సిట్ పేరుతో జరిపే దర్యాప్తునకు మళ్లీ కస్టడీ అవసరం లేదన్న నిందితుల తరఫు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది.
సిట్ దర్యాప్తునకు సహకరించండి
హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన ప్రతాప్ తరఫున సీనియర్ న్యాయవాది వినోద్ కుమార్ దేశ్పాండే వాదనలు వినిపించారు. కేసులో నిందితుడు కానప్పుడు 41ఏ నోటీసు జారీచేయటం అన్యాయమని, సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దర్యాప్తునకు పిలిస్తే ఏవిధమైన అభ్యంతరం లేదని చెప్పారు. 41ఏ నోటీసు మేరకు 25న సిట్ దర్యాప్తునకు హాజరుకావాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వాదనను సిట్ తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జే రామచందర్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆధారాలు ఉన్నందునే ప్రతాప్కు సిట్ నోటీసు ఇచ్చిందని, ఎలక్ట్రానిక్ డివైజెస్లోని ఆధారాలను బహిర్గతం చేయలేమని తెలిపారు. సిట్ దర్యాప్తును అడ్డుకొంటే ప్రతాప్ తన ఫోన్లోని కీలక సమాచారాన్ని ధ్వంసం చేసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతాప్ను విచారిస్తే ఈ కేసులో కీలక సమాచారం బహిర్గతం అవుతుందని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ సిట్ దర్యాప్తునకు హాజరు కావాల్సిందేనని ప్రతాప్ను ఆదేశించింది.