హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): నాలుగేండ్ల వయసులో హుషారుగా ఆడుకోవాల్సిన చిన్నారి.. అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతూ నేలమీద పాకుతున్నది. ఏడాది కిందటి వరకు ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేసిన ఆ చిన్నారి.. ఇప్పుడు నిలబడలేని స్థితిలో అవస్థపడుతున్నది. ఈ జన్యు సంబంధ వ్యాధిని నయం చేసే ఔషధం ఖరీదు రూ.16 కోట్లు. అందుకే ఆ కుటుంబం దాతల సాయం కోరుతున్నది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మజ్జిగ కల్లమాడప్ప, శివమ్మ కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. వారి కుమార్తె అద్వైత.. నిరుడు జూన్లో కొన్ని రోజులపాటు ఒక కాలు వంకరగా పెట్టి నడిచింది.
ఆ తర్వాత ప్రాజెక్టు పనిమీద ఆ కుటుంబం అమెరికాకు వెళ్లింది. అక్కడ మళ్లీ పాప నడకలో తేడా కనిపించడంతో దవాఖానకు తీసుకెళ్లారు. అనేక టెస్టుల అనంతరం గత మార్చిలో అద్వైత ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ (ఎస్ఎంఏ) అనే అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. జన్యులోపం వల్ల వెన్నెముకలోని కదలికలకు ఉపయోగపడే కండరాలు బలహీనం అవుతాయి. ఇది శరీరంలోని అన్ని అవయవాల కండరాలపై ప్రభావం చూపుతుంది. క్రమంగా కూర్చొనే, నిలబడే, నడిచే శక్తిని కోల్పోతారు. భూమికే పరిమితం అవుతారు. ఈ వ్యాధిని నయం చేసే ఔషధాన్ని నోవార్ట్టిస్ సంస్థ ‘జోల్గెన్సా’ పేరుతో తయారు చేస్తున్నది. దీని విలువ సుమారు రూ.16 కోట్లు. అంత మొత్తం ఖర్చు చేసే స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో దాతల సాయం కోరుతూ అమెరికాతో పాటు మన దేశంలో క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు. ఇప్పటివరకు సుమారు ఏడున్నర లక్షలు మాత్రమే సమకూరాయి. దాతలు మరింత మంది ముందుకొచ్చి సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకొంటున్నది.
పేరు: అద్వైత మజ్జిగ
అకౌంట్ నంబర్: 700701717371746
ఐఎఫ్ఎస్సీ కోడ్: YESB0CMSNOC
(B తర్వాత ‘సున్నా’ ఉంది పరిశీలించగలరు)
యూపీఐ ఐడీ: supportkallamada@yesbankltd