హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో చేరికల కాక మొదలైంది. ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరడంపై స్థానిక సీనియర్ నేతల్లో ఆసంతృప్తి తీవ్రమవుతున్నది. చేరికలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వన్మెన్ షో చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రేవంత్ ఇటు సీనియర్లకు, అటు చేరికల కమిటీకి కూడా సమాచారం ఇవ్వడం లేదంట. చేరికల పరిశీలన కోసం జానారెడ్డి చైర్మన్గా కమిటీ వేశారు. కానీ ఆ కమిటీకి తెలియకుండానే చేరికలు కొనసాగుతుండటం గమనార్హం. కాంగ్రెస్ కండువా కప్పుకొనేంతవరకు ఎవరు తమ పార్టీలోకి వస్తున్నారో సీనియర్లతోపాటు ఆయా స్థానిక నేతలకు కూడా తెలియడం లేదు. ఇందుకు ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, ఖమ్మం నుంచి తాటి వెంకటేశ్వర్ల చేరికనే నిదర్శనమంటున్నారు.
ఖమ్మం జిల్లాలో కీలకమైన నేత భట్టి విక్రమార్క. ఆయన శాసనసభ పక్షనేతతోపాటు పార్టీలో అత్యంత సీనియర్ కూడా. కానీ ఆయన సొంత జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును పార్టీలో చేర్చుకోవడంపై ఆయనకు కనీస సమాచారం కూడా లేదని తెలుస్తున్నది. శుక్రవారం వెంకటేశ్వర్లు చేరిక సందర్భంగా విలేకరులు భట్టి విక్రమార్కను ప్రశ్నించగా.. అసలు వెంకటేశ్వర్లు చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని, ఆ చేరికతో తనకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. విజయారెడ్డి చేరికపై స్థానిక కాంగ్రెస్ నేతలైన దాసోజు శ్రావణ్, రాజు యాదవ్, రోహన్రెడ్డికి ఎలాంటి సమాచారం లేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అసంతృప్తి చెందిన దాసోజు శ్రావణ్ పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు ఉంటున్నారట.