హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా మరో కీలక సంస్కరణను తీసుకురానున్నది. పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)తో సంబంధం లేకుండా నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) చేసినవారు నేరుగా పీహెచ్డీలోకి చేరే అవకాశాన్ని కల్పించనున్నది. దీనిపై యూజీసీ త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనున్నది. యూజీసీ నిర్ణయం అమలైతే.. బీఈ, బీటెక్, ఆనర్స్ డిగ్రీ, బీ ఫార్మసీ, ఫార్మా – డీ తదితర కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా పీహెచ్డీ కోర్సుల్లో చేరొచ్చు.
అయితే, విద్యార్థులు నాలుగేండ్లు లేదా ఎనిమిది సెమిస్టర్లు ఉన్న కోర్సులో 75 శాతానికిపైగా మార్కులు పొంది ఉండాలి. నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఏడాది, రెండు సెమిస్టర్ల వ్యవధి ఉన్న మాస్టర్స్ కోర్సును పూర్తిచేసిన వారు కూడా పీహెచ్డీలో చేరవచ్చని యూజీసీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు మూడేండ్లు డిగ్రీ, ఆ తర్వాత పీజీ కోర్సు చదివాక పీహెచ్డీ కోర్సుల్లో చేరే అవకాశం ఉన్నది. ముందుగా జేఆర్ఎఫ్, గెట్, సీడ్, నెట్, సెట్ అర్హతతోపాటు, వర్సిటీలు ప్రవేశపరీక్షలను నిర్వహించి పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
పీహెచ్డీ చేస్తున్నది 10శాతమే
దేశంలో ఉన్నత విద్యలో నమోదు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పీహెచ్డీ ప్రవేశాలు పెరగడం లేదు. ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (అయిషే) 2019-20 ప్రకారం పీజీ పూర్తి చేసినవారిలో 10 శాతం లోపులోనే పీహెచ్డీ చేస్తున్నట్టు తేలింది. పీజీలో 3.19 కోట్ల మంది ప్రవేశాలు పొందగా. పీహెచ్డీలో 2లక్షల మంది చేరారు.