హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్లో జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో జోక్యం చేసుకోరాదన్న మధ్యంతర ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం జస్టిస్ ఎం సుధీర్కుమార్ విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరీందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ భూమిని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు ఈటల జమున, కుమారుడు ఈటల నితిన్రెడ్డి ఆక్రమించుకున్నారని చెప్పారు. ఆ భూమి విషయంలో జోక్యం చేసుకోరాదన్న మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, పిటిషనర్లు జమునా హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు నితిన్రెడ్డి, జమునను కూడా ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16న జరుపుతామని తెలిపింది.