హైదరాబాద్/న్యూస్నెట్వర్క్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్నా కాంగ్రెస్లో మాత్రం ప్రతిష్ఠంభన తొలగడం లేదు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మిర్యాలగూడ, సూర్యాపేట, చార్మినార్, తుంగతుర్తి, పటాన్చెరు స్థానాలకు గురువారం రాత్రి అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే అంతకుముందే ఆశావహులు ఎవరికి వారు నామినేషన్లు వేయడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొన్నది. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి నామినేషన్లు వేశారు. సూర్యాపేట టికెట్ వ్యవహారం కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. పటేల్ రమేశ్రెడ్డి, ఆర్ దామోదర్రెడ్డి ఇద్దరూ పార్టీకి కావాల్సిన వారే. ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. మద్దతు లేకుంటే ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని పీసీసీ భావిస్తున్నది.
ఈ క్రమంలో గురువారం రాత్రి విడుదల చేసిన జాబితాలో రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరును ఖరారు చేశారు. నర్సాపూర్లో అభ్యర్థిగా నర్సారెడ్డి నామినేషన్ దాఖలు చేయగా.. పీసీసీ నాయకుడు మనోహర్రెడ్డి కూడా వేశారు. మిర్యాలగూడ అభ్యర్థిని ప్రకటించలేదు. గురువారం ఉదయం బత్తుల లక్ష్మారెడ్డి నామినేషన్ వేయగా రాత్రి ఆయన పేరును అధిష్ఠా నం ప్రకటిచింది. బాన్సువాడ కాంగ్రెస్ నాయకుడు బాలరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. నర్సాపూర్లో గాలి అనిల్కుమార్కు బదులు రాజిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో అనిల్కుమార్ ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో చర్చించారు. మహేశ్వరంలో పారిజాత నర్సింహారెడ్డి స్థానంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో ఇరువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. తనకే పార్టీ బీఫామ్ ఇవ్వాలని పారిజాత నర్సింహారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
వనపర్తి టికెట్ దక్కకపోవడంపై మాజీ మంత్రి చిన్నారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు సాజిద్ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవ్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం వారు ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకొన్న రాజకీయ బ్రోకర్ అని మండిపడ్డారు. తుపాకీ, కత్తులు లేకుండా హత్యలు చేసే వ్యక్తి రేవంత్ అని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు, సర్పంచ్ నూనావత్ రమేశ్ మహబూబాబాద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వరంగల్ పశ్చిమ నుంచి జంగా రాఘవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున ఒకటి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి సింహం గుర్తుపై మరొకటి, మొత్తం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఎల్ రమేశ్కు అందజేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు బీ-ఫాం ఇస్తుందన్న నమ్మకం ఉన్నదని తెలిపారు.
తుంగతుర్తి టికెట్ విషయంలోనూ పార్టీలో తీవ్ర అసంతృప్తి రేగింది. ఇక్కడ దాదాపు 20 మంది అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ తనకే వస్తుందని కొన్నాళ్లుగా సీనియర్ నేత అద్దంకి దయాకర్ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు ఇటీవల బీఆర్ఎస్ను వీడి, కాంగ్రెస్లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు కూడా టికెట్ ఆశించారు. రాష్ట్ర కార్యాలయంతోపాటు బెంగళూరు, ఢిల్లీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ చివరికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మందుల సామేల్కు టికెట్ కేటాయించారు. దీంతో అద్దంకి దయాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారినా ఫలితం లేదంటూ మోత్కుపల్లి నర్సింలు తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.
కాంగ్రెస్లో నెలకొన్న ప్రతిష్ఠంభనపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో అనుసరిస్తున్న తీరుపైనా ఆయన రాష్ట్ర నాయకులపై మండిపడినట్టు సమాచారం. ప్రచారం తీరు సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హెచ్చరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించారు. ప్రతిష్ఠంభన నెలకొన్న నియోజకవర్గ అభ్యర్థులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. పార్టీ ముఖ్యనేతలతో గురువారం రాత్రి హైదరాబాద్లో సమావేశమయ్యారు. ప్రకటించాల్సిన నాలుగు నియోజకవర్గాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాలకు సంబంధించి సర్వే నివేదికలు తెప్పించుకొని తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. నీలం మధు ముదిరాజ్ స్థానంలో కాట శ్రీనివాస్గౌడ్కు టికెట్ను కేటాయించింది. కాట శ్రీనివాస్గౌడ్కు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, నీలం మధుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతుగా నిలిచారు. వాస్తవానికి నీలం మధుకు టికెట్ ఇస్తామని చెప్పడంతోనే ఆయన కాంగ్రెస్లో చేరారు. ఇటీవల విడుదల చేసిన మూడో జాబితాలో నీలం మధు పేరు ప్రకటించారు. కాట శ్రీనివాస్గౌడ్కు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడి చేసి రేవంత్ ఫ్లెక్సీలను, ఫొటోలను చింపి తగులబెట్టారు. బుధవారం నీలం మధు, శ్రీనివాస్గౌడ్ పోటాపోటీగా నామినేషన్లు వేశారు. దీంతో పార్టీ టికెట్ తమకేనని ఇద్దరూ చెప్పుకొచ్చారు. చివరకు గురువారం రాత్రి ప్రకటించిన జాబితాలో శ్రీనివాస్గౌడ్ పేరును ఖరారు చేశారు. ‘పార్టీ కార్యాలయంపై దాడి చేసి, ఫొటోలు తగులబెడితే టికెట్లు ఇస్తారా?’ అంటూ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది.
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆది నుంచి వివాదాలతో నడుస్తున్నది. తొలుత అత్త వచ్చిం ది. తర్వాత కోడలు వచ్చింది. అత్తకు పౌరస త్వం లేకపోవడంతో చివరికి సీటు కోడలికి దక్కింది. కొడలి వారసత్వం ఓటు మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరికి కోడలు యశస్వినీరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్పై ఆర్వో పలు ప్రశ్నలు అడిగారు. ఓటు హక్కు సర్టిఫైడ్ కాపీ ఒరిజినల్ కావాలని సూచించారు. పార్టీ ఏ ఫాం, బీ ఫాంలు 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు అందజేయాలని ఆదేశించారు. పరిశీలనలో యశస్విని నామినేషన్ ఉంటుందా, తిరస్కరణకు గురవుతుందా? అనే చర్చలు నడుస్తున్నాయి.