భద్రాచలం: భద్రాద్రికి ముక్కోటి శోభ వచ్చింది. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. తెప్పోత్సవానికి హంస వాహనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్తర ద్వారదర్శన మండపం ముస్తాబైంది. ఆలయానికి రంగులు వేయడం, ఆవరణలో చలువ పందిళ్లు.. స్వాగత ద్వారాల ఏర్పాటు వంటి పనులు పూర్తయ్యాయి.
శుక్రవారం నుంచి జనవరి 12 వరకు అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. ఇందులోభాగంగా భద్రాద్రి రామయ్య 23న మత్స్యావతారంలో, 24న కూర్మావతారంలో, 25న వరాహావతారంలో, 26న నరసింహావతారంలో, 27న వామనావతారంలో, 28న పరుశురామావతారంలో, 29న శ్రీరామావతారంలో, 30న బలరామావతారంలో, 31న శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
జనవరి 1న తిరుమంగై ఆళ్వార్ పరమ పదోత్సవం, అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. దీంతో పగల్ పత్తు ఉత్సవాలు సమాప్తమవుతాయి. 2వ తేదీ తెల్లవారుజామున 5.00 నుంచి 6.00 గంటల వరకు ఉత్తరద్వార దర్శనం నేత్రపర్వంగా నిర్వహిస్తారు.