హైదరాబాద్ : ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని తదితరులు ఎన్టీఆర్కు నివాళులర్పించి అంజలి ఘటించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.
మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరమని, అవి ఎన్టీఆర్లో ఉండేవని బాలకృష్ణ అన్నారు. సూర్యచంద్రులు ఉన్నన్నాళ్లూ ఆయన బతికే ఉంటారని చెప్పారు. సినిమాల్లో ఎవరూ చేయని పాత్రలు ఎన్టీఆర్ చేశారని గుర్తుచేశారు. ప్రతిపాత్రలోనూ పరకాయ ప్రవేశంతో నటనలో ఎన్నో ప్రయోగాలు చేశారని చెప్పారు. టీడీపీని స్థాపించి సంచలనం సృష్టించారని, కొంతమందికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరికీ చేర్చారని అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు చేయూత అందించారన్నారు. నేను తెలుగువాడిని అని ప్రతి ఒక్కరూ గర్వించేలా చేశారని చెప్పారు.
పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు. ప్రజల వద్దకు పాలనను చేరువచేశారన్నారు. తెలుగు గంగ, గాలేరు నగరి లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారని, ఆయన స్ఫూర్తిని టీడీపీ కొనసాగిస్తోందని బాలకృష్ణ చెప్పారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి గుండెచప్పుడు, కళామతల్లి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారని చెప్పారు.