హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రోగికి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు డాక్టర్ల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. వీరిలో ఒక వైద్యుడు ఎడమ కాలికి బదులు కుడికాలికి సర్జరీ చేయగా, మరో వైద్యుడు రోగిని ఆలస్యంగా పెద్ద దవాఖానకు రెఫర్ చేశాడు. దీంతో ఆ రోగి మృతి చెందాడు. ఈ ఘటనలపై ఫిర్యాదులు రావడంతో మెడికల్ కౌన్సిల్ విచారణ జరిపి తాజాగా చర్యలు తీసుకున్నది. ఆ వివరాలు ఇవీ..
2021 జూలై 14న ఓ వ్యక్తికి ఎడమకాలు ఫ్రాక్చర్ కావడంతో చికిత్స కోసం హైదరాబాద్ ఈసీఐఎల్లోని రాఘవేంద్ర శ్రీకర్ హాస్పిటల్కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న డాక్టర్ కరణ్ ఎం పటేల్ మరుసటి రోజు నిర్లక్ష్యంగా కుడి కాలుకు సర్జరీ చేసి, మెటల్ స్క్రూలు అమర్చాడు. బాధితుడి బంధువులు ఈ తప్పును గుర్తించి వైద్యుడిని నిలదీయడంతో 16వ తేదీన మరో సర్జరీ చేశాడు. కుడికాలిలో బిగించిన మెటల్ స్క్రూలను తొలగించి, ఎడమకాలికి సర్జరీ చేశారు. తన పొరబాటు వల్లే ఇదంతా జరిగిందని ఆ వైద్యుడు అంగీకరించడంతో బాధితులు మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం డాక్టర్ కరణ్ ఎం పటేల్ లైసెన్స్ను 3 నెలలపాటు రద్దు చేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది.
డెంగీ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి 2019 అక్టోబర్ 10న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముఖేశ్ హాస్పిటల్కు రావడంతో డాక్టర్ శ్రీకాంత్ చికిత్స అందించాడు. 6 రోజుల తర్వాత ఆ రోగి మరణించడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. రోగి పరిస్థితి విషమించినప్పటికీ పెద్ద దవాఖానకు రెఫర్ చేయకుండా డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో తేలింది. ఆ వైద్యునిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన మెడికల్ కౌన్సిల్.. డాక్టర్ శ్రీకాంత్ లైనెన్స్ను 3 నెలలు రద్దు చేసింది.