హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ రిజిస్ట్రీ ద్వారా కచ్చితమైన డాటాతో మెరుగైన ప్రణాళికలు రూపొందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డేకేర్ క్యాన్సర్ సెంటర్ల ద్వారా కీమోథెరపీ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించేందుకు త్వరలో 20 ప్రభుత్వ దవాఖానల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామని, ఇందుకోసం ఆస్ట్రాజెనెకా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. అనంతరం వైద్యశాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి మంత్రి అవార్డులు అందజేశారు. ఆ తర్వాత ఎర్రగడ్డలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో దాదాపు రూ.20 కోట్లతో నిర్మించిన ‘డీ-అడిక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ భవనాన్ని ప్రారంభించడంతోపాటు ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు.