న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ కొత్త మార్గదర్శకాలపై ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి విమర్శనాత్మకమైన, పరిశోధనాత్మకమైన రిపోర్టింగ్ను నియంత్రించాలనే ఉద్దేశంతో అస్పష్టమైన, ఏకపక్ష, క్రూరమైన నిబంధనలు చేర్చారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. జర్నలిస్టు అక్రెడిటేషన్ రద్దుకు సంబంధించి కొత్త నిబంధనలు ఏకపక్షంగా, చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఉన్నాయని విమర్శించింది. కొత్త మార్గదర్శకాలను తక్షణం ఉపసంహరించుకోవాలని, సంబంధిత పక్షాలతో చర్చలు జరిపి సవరణ మార్గదర్శకాలతో ముందుకు రావాలని డిమాండ్ చేసింది.