చెన్నారావుపేట, మే 9: మక్కజొన్న కొయ్యలు కాల్చుతుండగా మంటలంటుకొని రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు (65) తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న కొయ్యలకు నిప్పుపెట్టాడు. అనుకోకుండా మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు వ్యాపించాయి. దీంతో మంటలను ఆర్పేందుకు వెళ్లిన పాపారావు ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించామని ఎస్సై అరుణ్కుమార్ తెలిపారు.