నల్లగొండ : నల్లగొండ పట్టణ అభివృద్ధికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం అభివృద్ధికి ఆఘమేఘాల మీద అడుగులు పడుతున్నాయి.
నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలతో పాటు నల్లగొండ పరిసర గ్రామాలు, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని మంగలపల్లి, ఎల్లారెడ్డిగూడెం, చెరువుగట్టు గ్రామాలను కలుపుతూ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( NUDA) గా మారుస్తూ ప్రభుత్వం జి. ఓ విడుదల చేసింది.
ఈ మేరకు పట్టణ అభివృద్ధి ప్రణాళికలపైన ప్రత్యేకంగా సోమవారం హైదరాబాద్లో స్థానిక జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, పురపాలక శాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ సమీక్షలో NUDA జి. ఓ ను రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్కు జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి అందజేశారు. అంతే గాకుండా నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణకు గాను సీఎం కేసీఆర్ అదేశంతో విడుదల చేసిన నిధుల జి.ఓలను మంత్రి కేటీఆర్ భూపాల్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..నల్లగొండ జిల్లా కేంద్రం సమగ్ర అభివృద్ధి కోసం వేగంగా ముందుకు కదలాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నల్గొండ పట్టణ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ముఖ్యంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణ రూపురేఖలు సమూలంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పురపాలక శాఖ ఉన్నతాధికారులు నల్గొండ పట్టణంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరాలు అందజేశారు. రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్ నిర్వహణ, గ్రీనరీ పార్కుల అభివృద్ధి, ఉదయ సముద్రం సుందరీకరణ వంటి కార్యక్రమాల పైన చర్చించారు.
పట్టణానికి సంబంధించి వాటర్, ఆడిట్ పవర్ ఆడిట్ ని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
పట్టణ అభివృద్ధికి సంబంధించి స్వల్పకాలిక లక్షలతో పాటు రానున్న ఏడాది లోపల చేపట్టబోయే వివిధ కార్యక్రమాల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.