వేములవాడ, అక్టోబర్ 18: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో సివిల్ కాంట్రాక్టర్ సుంకరి మహేశ్ పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. టెండర్ ప్రకారం పలు పనుల గడువు 6 నెలల కింద ముగిసిపోగా, గడువు పొడిగించాలని గత ఏప్రిల్లో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్రావును మహేశ్ కోరారు. పనుల్లో ఒక శాతం కమీషన్ ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేశారు. మహేశ్ తన సూపర్వైజర్ సత్యం ద్వారా సంప్రదింపులు జరుపగా.. రూ.30 వేలకు ఒ ప్పందం కుదిరింది. ఇదే సమయంలో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సూపర్వైజర్ ద్వారా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు రూ.30 వేలు ఇప్పించారు. అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు కమిషనర్ శ్యాంసుందర్ ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తరువాత కమిషనర్ నివాసంలోనూ సోదాలు జరిపారు.