హైదరాబాద్/జయశంకర్భూపాలపల్లి/ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనులశాఖ ఏడీ(సహాయ సంచాలకుడు, గనులు, భూగర్భశాఖ) బొజ్జ జయరాజ్కు సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయిమనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్నగర్ కాలనీలో జయరాజ్ నివాసం, సూర్యాపేట, తాండూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని జిల్లా భూగర్భగనుల శాఖ కార్యాలయం, జయరాజ్ బంధువుల ఇండ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరితో జయరాజ్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే కోణంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో అధికారిక రికార్డుల ప్రకారం లభ్యమైన ఆస్తుల విలువ రూ.3,06,53,177గా ఏసీబీ తేల్చింది. మారెట్లో వీటి విలువ దాదాపు రూ.60 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.
భూగర్భ గనులశాఖ ఏడీ బొజ్జ జయరాజ్ ఇటీవల నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న కొద్దిరోజుల వ్యవధిలోనే ఏసీబీ అధికారులు సోదా చేయడం కలకలం రేపింది. ఆయన ఇంటితోపాటు బంధువుల ఇండ్లు, ఆయనకు సంబంధించిన 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు జరుపడంతో జిల్లాలోని ఇతర శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో టెన్షన్ నెలకొన్నది. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జయరాజ్కు సంబంధించిన ఆస్తుల కొనుగోళ్లు, వాటి విలువ, ఆదాయ వనరులు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, ఇండ్లు, కార్యాలయాలు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణలో మరో సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్ వివరాలను పరిశీలించగా, అతని బ్యాంక్ ఖాతా నుంచి జయరాజ్ కు మార్తె ఖాతాకు దాదాపు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్టు ఏసీబీ గుర్తించింది. ఇసుక దందాతో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి ఈ సొమ్ము వసూలు చేసినట్టు డ్రైవర్ అంగీకరించాడని అధికారులు తెలిపారు.