హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తిరగబడాలని సీపీఐ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. మఖ్దూంభవన్లో దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కొమరయ్య చరిత్రను వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తున్నదని ధ్వజమెత్తారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలమల్లేశ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకుడు ఆర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.