అబిడ్స్, జనవరి 5: ఐఫోన్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన వ్యక్తిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేసి, రూ.64 లక్షల విలువైన 102 ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారని మధ్య మండలం డీసీపీ శరత్చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం అబిడ్స్ పీఎస్లో ఏసీపీ ఆకుల చంద్రశేఖర్, సీఐ నరసింహారాజు, ఎస్సై సుధాకర్తో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. అబిడ్స్లోని జగదీశ్ మార్కెట్లో అబ్దు ల్లా విరాని మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. గతేడాది నవంబర్ 29న ముంబైకి చెందిన విజయ్కుమార్, నీరవ్రాజ్ హోల్సెల్గా ఐఫోన్లు కావాలని అబ్దుల్లాను సంప్రదించారు. ఫోన్లు అందిన వెంటనే డబ్బులు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన అ బ్దుల్లా 107 ఐఫోన్లను వారు సూచించిన గుజరాత్ అడ్రస్కు కొరియర్ చేశాడు. ఫోన్లు రిసీవ్ చేసుకున్నా వారు డబ్బులు పంపించకపోవడం తో మోసానికి గురైనట్టు అబ్దుల్లా గుర్తించాడు. డిసెంబర్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ నరసింహారాజు ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్ బృందం గుజరాత్కు వెళ్లి ఏ2 నీరవ్రాజ్ను అదుపులోకి తీసుకొని 102 ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చామని, ఏ1 విజయ్ను త్వరలో పట్టుకుంటామని డీసీపీ వెల్లడించారు.