మాడ్గులపల్లి: పల్లెల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమన్న మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రం లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పల్లెలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. అందులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గామాల్లోని మౌలిక వసతులు గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇదే క్రమంలో ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన నిధులతో మండలంలోని గుర్రప్పగూడెంలో అనేక పనులు చేపట్టారు. గ్రామంలో జనాభా 1420 ఉండగా ఓటర్లు 1054 మంది ఉన్నారు. గ్రామానికి ప్రభుత్వం నెలనెలా విడుదల చేస్తున్న గ్రాంట్తో పంచాయతీ కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ కిస్తీలు, వీధి లైట్ల బిల్లులు పోను మిగిలిన వాటితో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతున్నారు.
పల్లె ప్రగతిలో భాగంగా గుర్రప్పగూడెం గ్రామంలోని రెండు ఎకరాల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డ్లను నిర్మించారు. పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేసి, వీధిలైట్లు బిగించారు. వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేశారు. అంతర్గత రోడ్ల వెంట కంపచెట్లు తొలగించారు. పం చాయతీ ట్రాక్టర్తో నిత్యం ఇంటింటి నుంచి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల పారిశుధ్యం మెరుగుపడింది. వీధులు పరిశుభ్రంగా మారాయి.
నాడు క్షామం .. నేడు పుష్కలం
గతంలో గ్రామంలో కాలంతో సంబంధం లేకుండా తీవ్ర నీటి కొరత ఉండగా నేడు మిషన్ భగీరథ ద్వారా గ్రామంలో ఏండ్ల నాటి మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామస్తులకు ఇంటింటికీ సరిపడానీరు అందుతోంది. అదేవిధంగా గ్రామంలో సుమారు 25లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించారు.
రూ. 12.30 లక్షలతో వైకుంఠధామం, రూ.1.50 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టారు. గ్రామంలో తడిపోడి చెత్తను సేకరించి డంపింగ్యార్డులో కంపోస్ట్ తయారీ చేపట్టారు. దీనిని రైతులకు విక్రయించడానికి అందుబాటులో ఉంచనున్నారు. పల్లెప్రకృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.