Aasara Pension | కట్టం తెలిసినోల్లే.. దాన్ని తీర్సే ఉపాయం చేస్తరని పెద్దలంటరు. నా బతుకు తెలంగాణ అచ్చినంకనే ఓ గడ్డన వడ్డది. మా ఆయన వడ్రంగి పని చేసేటోడు. ఎన్ని తిప్పలున్నా.. మేం మంచిగనే ఉండేటోళ్లం. సక్కగ సాగుతున్న సంసారం ఒక్కపూటలో ఆగమైంది. పదేండ్ల కిందట మా ఆయన నరాల జబ్బుతోని సచ్చిపోయిండు. అప్పటికి నాకు 26 ఏండ్లు. ఇద్దరు పిల్లలు. భూమి లేదు. బతికే తోవ లేదు. సదువుందా అంటే.. ఎనిమిదో తరగతితోనే ఆగిపోయింది. కైకిలి చేసుకుంట పిల్లల్ని సదివించుకున్న. ఆయన సచ్చిపోయిన కొన్నాళ్లకు వితంతు పింఛన్ వచ్చింది. ఆ రెండు వందల పింఛన్ వచ్చినా రానట్టే ఉండేది.
పాతకాలం ఇల్లు కూలిపోయింది. కట్టించుకునే పైసల్లేక కిరాయింట్లకు మారిన. తెలంగాణ అచ్చినంక పింఛన్ వెయ్యి రూపాయలు అయింది. అదే మా ఇంటికి ఆసరా అయింది. తర్వాత రెండు వేలు చేసుడుతోని ఒక్కో గండం నుంచి గట్టెక్కిన. కైకిలి పైసలతోని ఇల్లు గడుస్తుంది. పింఛన్ పైసలతోని పిల్లల సదువు ఎల్తున్నది. నేను మళ్లీ సదువు షురూ చేసిన. కైకిలికి పోతనే సదువుకుంటున్న. పింఛన్ పైసల్తోని ఫీజు కట్టి పది, ఇంటర్ పాసైన. డిగ్రీల చేరిన. ఒక సెమిస్టర్ పరీక్షలు రాసిన. పిల్లలు కాలేజీ సదువుకొచ్చినరు. కర్సులు పెరుగుడుతోని నా సదువు ఆపేసిన. ఇంట్ల అవసరాల కోసం వంద రూపాయలు అప్పు జేస్తే, ఆసరా పింఛన్ రాంగనే తీరుస్తున్న. కేసీఆర్ సార్ ఇస్తున్న ఆసరా నాకు, నా కుటుంబానికి దైర్నమైంది.
వడ్ల అనిత, అంబాజీపేట గ్రామం, చిన్న శంకరంపేట మండలం, మెదక్ జిల్లా