హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్, హోంశాఖ మంత్రి అమిత్షాపై కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ఆతిషి డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, అమిత్షాను మంత్రి పదవి నుంచి తప్పించాలని కోరారు. కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తూ ప్రభుత్వాలను అస్థిరపర్చడమే బీజేపీ పనిగా పెట్టుకొన్నదని ఆరోపించారు. విపక్ష నేతల ఇండ్లలో సోదాలు నిర్వహించే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు బీజేపీ నేతల ఇండ్లలో ఎందుకు సోదాలు నిర్వహించవని ప్రశ్నించారు.
ఆడియో సంభాషణలో బీఎల్ సంతోష్ పేరు, నంబర్-2 షా అన్న పేర్లు స్పష్టంగా ఉన్నాయని, నంబర్-2 షా అంటే, అమిత్షా అనడంలో సందేహంలేదని చెప్పారు. బీజేపీ అమలు చేస్తున్న ఆపరేషన్ లోటస్ను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో బట్టబయలు చేశారని చెప్పారు. ఢిల్లీ ఎమ్యేల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ.1,075 కోట్లు సిద్ధం చేసిందని, ఆ పార్టీ నేతల ఇండ్లలో కూడా తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో చేరేందుకు ఒకో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఆఫర్ చేస్తున్నారని, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కూడా ఆఫర్ చేశారని తెలిపారు. సీబీఐ, ఈడీ కేసులు మూసేస్తామని, ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఆయనకు ఆఫర్ చేసిందని వివరించారు. మనీష్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించేందుకు పిలిచిన సమయంలో కూడా డబ్బులు ఆఫర్ చేశారని చెప్పారు. పంజాబ్లో కూడా ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారని, తాజాగా తెలంగాణలో కూడా ఆపరేషన్ లోటస్ బట్టబయలు అయిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చి న ముగ్గురు దళారులకు బీజేపీ కీలక నేతలతో సంబంధాలు ఉన్నట్టు వారి ఆడియో సంభాషణను బట్టి అర్థమవుతున్నదని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు.