మంచిర్యాల : సెల్ఫోన్(Cellphone) బాగు చేయించలేదని మనస్తాపంతో ఓ యువతి(Young woman) ఆత్మహత్యకు( committed suicide) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా (Mancheriala) జైపూర్ మండలం వేలాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అయితే కూతురు సాయిషుమా(19) సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది.
దీంతో తరచూ సెల్ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి మందలించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు అంటూ సాయిషుమా మనస్తాపానికి గురైంది.
తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిషుమా మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.