నిజామాబాద్: జీవితంలో అవసరాల కోసం ఒకరికొకరు నగదు ఇచ్చిపుచ్చుకోవడం సర్వ సాధారణమే. ఇలా తీసుకున్న డబ్బును ఎవరైనా మొండిగా తిరిగివ్వకపోతే గట్టిగా నిలదీసి రాబట్టుకుంటాం. రావాల్సిన సొమ్ము పెద్ద మొత్తమైతే నలుగురిలో పంచాయితీ పెట్టి మరీ వసూలు చేసుకుంటాం. చిన్న మొత్తమైతే వాడి విజ్ఞతకే వదిలేసి దూరం పెడుతాం. కానీ నిజామాబాద్కు చెందిన ఓ యువకుడు మాత్రం వీటన్నింటికి భిన్నంగా తన డబ్బును రాబట్టుకునే ప్రయత్నం చేశాడు.
నిజామాబాద్ త్రీ టౌన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే రవీందర్ అనే వ్యక్తి పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆదివారం ఉదయం అతను నగరంలోని ఓ సర్కిల్లో ఉన్న హోర్డింగ్పైకి ఎక్కాడు. స్థానికులు గమనించి కిందకి దిగమన్నా దిగకుండా దానిపైనే పడుకున్నాడు.
సమాచారం అందుకున్న నగర సీఐ తన సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకుని రవీందర్ను కిందకు దించాడు. అనంతరం హోర్డింగ్ ఎందుకు ఎక్కావని రవీందర్ను ప్రశ్నించగా.. తన దగ్గర ఒక వ్యక్తి రూ.1000 అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వడంలేదని, అందుకే ఈ పనిచేశానని చెప్పాడు.
రవీందర్ చెప్పిన సమాధానం విని పోలీసులు విస్తుపోయారు. కేవలం వెయ్యి రూపాయల కోసం ఇంత హల్చల్ చేశావా..? అంటూ అతన్ని స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కాగా, సదరు యువకుడు మద్యానికి బానిస అయ్యాడని, గతంలో కూడా ఒకసారి ఇలాగే హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడని స్థానికులు చెబుతున్నారు.