మొయినాబాద్, అక్టోబర్ 4: పుట్టిన రోజు నే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందాడు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు ఒకే బైక్పై ఐదుగురు ప్రయాణిస్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయారు. దీంతో ఐదుగురిలో పుట్టిన రోజు ఉన్న యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది.
కర్ణాటక యాద్గిర్ జిల్లా గుర్మిట్కల్ మండలం చెంద్రికి చెందిన రాఘవేంద్ర(18) పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులు తిమ్మప్ప, నరేష్, శ్రీనివాస్, వీరేష్ కలిసి వేడుక లు నిర్వహించేందుకు ఒకే బైక్పై వెళ్తున్నారు. తోలుకట్టా గేట్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో అందరికీ గాయాలయ్యాయి. ఇందులో రాఘవేంద్ర తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.